Ragging

Ragging: ర్యాగింగ్ కలకలం.. విద్యార్థులతో కలిసి ప్రొపెసర్..

Ragging: విద్యాలయాలు విజ్ఞానాన్ని పంచాల్సిన నిలయాలు. కానీ, కొన్ని చోట్ల అవే మృత్యుకూపాలుగా మారుతున్నాయి. ‘ర్యాగింగ్’ అనే భూతం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినా అంతం కావడం లేదు. జూనియర్లను వేధించడం ఒక ఫ్యాషన్‌గా భావిస్తున్న కొందరు విద్యార్థుల వల్లే ఏటా ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన విద్యా వ్యవస్థకే మచ్చగా నిలిచింది.

కలలన్నీ కన్నీరయ్యాయి..

హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది ఆ 19 ఏళ్ల యువతి. ధర్మశాలలోని సిద్బరి ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థిని సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే, అదే కాలేజీకి చెందిన ముగ్గురు సీనియర్ విద్యార్థినులు ఆమెను ర్యాగింగ్ పేరుతో నరకయాతన పెట్టారు. శారీరక హింసకు గురిచేయడమే కాకుండా, తీవ్రంగా కొట్టడం మరియు బెదిరింపులకు పాల్పడ్డారు.

ప్రొఫెసర్ వికృత చేష్టలు..

ఈ ఘటనలో మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సిన ఒక ప్రొఫెసర్ కూడా ఈ వేధింపుల్లో పాలుపంచుకోవడం. సదరు ప్రొఫెసర్ ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, అభ్యంతరకరంగా తాకుతూ వేధించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినుల వేధింపులకు తోడు, ప్రొఫెసర్ చేసిన ఈ పనులు ఆ యువతిని మానసిక కుంగుబాటులోకి నెట్టేశాయి.

ఇది కూడా చదవండి: Rohini: షార్ట్స్ లండన్ లో వేస్తారు.. మన కాడ కాదు.. మనం చీర కడ్తాం.. వైరల్ కామెంట్స్ చేసిన నటి

రెండు నెలల పోరాటం తర్వాత..

ఆ వేధింపుల కారణంగా ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి (Depression) లోనైంది. ఎవరైనా తాకితేనే వణికిపోయేంత భయానికి గురైంది. కూతురి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు ఆమెను నయం చేయించడానికి పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ, ఆమె మనసుపై పడిన గాయం మందులకు లొంగలేదు. దాదాపు రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి, చివరికి 2025 డిసెంబర్ 26న ఆ యువతి తుదిశ్వాస విడిచింది.

కళ్ళలో కనిపిస్తున్న భయం..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఆ వీడియోలో జరిగిన సంఘటన గురించి అడుగుతుంటే, ఆమె కళ్ళలో కనిపిస్తున్న భయం ఆమె ఎంతటి చిత్రహింసలను అనుభవించిందో స్పష్టం చేస్తోంది. పక్కనే ఉన్న తల్లి ఎంత ధైర్యం చెబుతున్నా, ఆ యువతి గజగజ వణికిపోవడం అందరినీ కలచివేస్తోంది.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆసుపత్రుల చుట్టూ తిరగడం వల్ల కేసు పెట్టడం ఆలస్యమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులైన ఆ ముగ్గురు యువతులు మరియు ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *