Delhi: కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియడంతో కొత్త ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. మొత్తం ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపును జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. జనవరి 20 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది.
ఈ సందర్భంగా, ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఈవీఎంలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలు తప్పు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయి. ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని స్పష్టం చేస్తున్నాము. గత ఏడాది ఎలక్షన్లను విజయవంతంగా నిర్వహించాము,” అని పేర్కొన్నారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను ఖండిస్తూ, “ఈవీఎంలతోనే ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని, ఈవీఎంల రిగ్గింగ్ జరిగినట్లు ఎక్కడా నిరూపించబడలేదు” అని చెప్పారు. ఈవీఎంల రిగ్గింగ్ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ ఈ ప్రెస్ మీట్ను తన చివరి ప్రెస్ మీట్గా ప్రకటించారు. పోలింగ్ శాతం గురించి కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, “పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు కచ్చితమైన పోలింగ్ శాతం వెల్లడించడం సాధ్యం కాదు” అని చెప్పారు.

