Delhi: ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఆపరేషనల్ కారణాల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నేడు దేశవ్యాప్తంగా 118 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇండిగో తన అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది.
ఇండిగో తెలిపిన వివరాల ప్రకారం, రద్దైన విమానాల్లో ఆరు విమానాలు నిర్వహణ కారణాలతో నిలిచిపోగా, మిగిలిన విమానాలు వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రద్దయ్యాయి.
ఈ విమాన రద్దుల ప్రభావం హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ఎక్కువగా కనిపించింది. అదేవిధంగా కొచ్చిన్, కోల్కతా, అమృత్సర్, చండీగఢ్, జైపూర్, డెహ్రాడూన్, ఇండోర్, పాట్నా, భోపాల్ వంటి నగరాలకూ విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
ముఖ్యంగా ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక విమానాశ్రయాల్లో పొగమంచు తీవ్రంగా ఉండటంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడినట్లు ఇండిగో పేర్కొంది. ప్రయాణికులు తమ విమాన స్థితిగతులను ముందుగానే వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవాలని సూచించింది.
విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇండిగో సూచనలు జారీ చేసింది.
