KTR: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. సీఎం రేవంత్ను ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తూ రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాల్మూరి, దీనివల్ల రేవంత్ ప్రతిష్టపై దెబ్బ పడేలా చేసేందుకు కేటీఆర్ ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోను బాల్మూరి ఆధారంగా చూపారు. అందులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని, అలాగే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఫిర్యాదులో వివరించారు. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్పై విచారణ జరుపుతున్న కీలక సమయంలో ఈ వ్యాఖ్యలు కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటలు
పోలీసులు ఫిర్యాదు, సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని భారతీయ న్యాయ సంహిత (BNS) కింద సెక్షన్ 353(2) – ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రకటనలు, సెక్షన్ 352 – ఉద్దేశపూర్వక అవమానానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. కేటీఆర్ స్పందన ఎలా ఉండబోతుందో అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

