Sobhita Dhulipala: చెన్నైలోని పచ్చయప్ప కళాశాల మైదానంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ‘మార్గళియిల్ మక్కళ్ ఇసై’ (Margazhiyil Makkal Isai) ఆరో ఎడిషన్ ఆదివారంతో ఘనంగా ముగిసింది. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ నేతృత్వంలోని నీలం కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల గ్రాండ్ ఫినాలేకు నటి, నాగచైతన్య భార్య శోభితా ధూళిపాళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ ఉత్సవాలు డిసెంబర్ 28 రాత్రి వరకు కళాకారులు, సంగీత ప్రియుల మధ్య అట్టహాసంగా సాగాయి.
కేవలం శాస్త్రీయ సంగీతానికే పరిమితం కాకుండా గానా, రాప్, జానపద, సామాజిక చైతన్యాన్ని కలిగించే సంగీత రూపాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ముగింపు వేడుకలో శోభితా ధూళిపాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన దేశ సాంస్కృతిక వారసత్వం చాలా గొప్పదని, ఇలాంటి వేదికలు యువతలో కళల పట్ల ఆసక్తిని, విలువలను పెంపొందిస్తాయని కొనియాడారు. సాంప్రదాయ, ఆధునిక శైలి కలయికతో రూపొందిన ప్రదర్శనలను చూసి ఆమె మంత్రముగ్ధురాలయ్యారు. కళాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తున్న పా. రంజిత్ కృషిని ఆమె ఈ వేదికపై ప్రత్యేకంగా అభినందించారు.

ఈ ఆరో ఎడిషన్లో మూడు రోజుల పాటు కర్ణాటక సంగీతం, భక్తి గీతాలతో పాటు అణగారిన వర్గాల గళాన్ని వినిపించే విభిన్న కళా రూపాలు ప్రేక్షకులను అలరించాయి. చివరి రోజున శోభితా తన స్టైలిష్ లుక్స్లో వేడుకకు విచ్చేసి సందడి చేయగా, ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు వేలాది మంది సంగీత అభిమానులు హాజరైన ఈ వేడుక, చెన్నై సాంస్కృతిక చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది.

