Crime News:ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి వంటిది.. ఆడపిల్ల ఇంటికి పరిపూర్ణత.. అందుకే ఆడపిల్లను బతకనీయండి.. అంటూ ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఇంకా జాఢ్యం వీడటం లేదు. కొందరు మూర్ఖులు ఆడపిల్లను భారంగా భావిస్తూ ఆదిలోనే చిదిమేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అలాంటి ఘోరమే జరిగింది. ఆడపిల్ల పుట్టిందని తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకెళ్లిన ఆ తండ్రి గొంతు కోసం చంపేశాడు. హృదయ విదారకమైన ఈ ఘటనతో ఆ తల్లి రోదనకు అంతే లేకుండా పోయింది. ఆ దుర్మార్గపు తండ్రిని ఇరుగు పొరుగు ఈసడించుకుంటున్నారు.
Crime News:నేపాల్ దేశం నుంచి వలస వచ్చిన జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్ లో జగత్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉండగా, వారి కొడుకు అనారోగ్యంతో మృతిచెందాడు. 14 రోజుల క్రితం గౌరీ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆ తల్లి మురిసిపోయింది. మురిపెంగా చూసుకోసాగింది.
Crime News:ఈ దశలో ఆడపిల్ల పుట్టిందని జగత్ విశ్వకర్మలో విషం నిండుకున్నది. పుట్టిన నాటి నుంచే ఏవగించుకోసాగాడు. భారమని అనుకున్నాడో.. ఏమో కానీ, ఆ పసికందును వదిలించుకోవాలనే నిర్ణయించుకున్నాడు. పాలు తాగి తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రిస్తున్న ఆ పసికందును జగత్ ఎత్తుకోగానే, తండ్రి వెచ్చదనం అని భావించిన ఆ చిన్నారి నవ్వులు విరబూసింది. తన తండ్రే తన తనువును ఆదిలోనే హరిస్తాడని ఆ పసికందు భావించలేదు.
Crime News:ఆ పసిపాపను బయటకు తీసుకెళ్లిన ఆ దుర్మార్గుడు కత్తితో గొంతుకోసి ఆ మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి పెట్టాడు. ఈలోగా నిద్ర నుంచి లేచిన గౌరీ పక్కనే ఉండే పసిపాపను పొదిమి చూసింది. పక్కలో ఉన్న పసికందు లేకపోవడంతో ఆందోళనకు గురైంది. పాప ఎక్కడని భర్తను అడిగితే నీళ్లు నమిలాడు. గట్టిగా నిలదీయడంతో ఆ దుర్మార్గుడు చెప్పిన మాటతో గుండె పగిలినంత పనైంది. చంపి గోనె సంచిలో చుట్టానని చెప్పడంతో గుండెలవిసేలా ఏడ్వసాగింది.
Crime News:ఆ తర్వాత గౌరీ సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం ఇచ్చేందుకు బయటకు వెళ్లింది. ఈ సమయంలో పసికందు మృతదేహాన్ని ఆమె తండ్రి చెత్త కుప్పలో పడేశాడు. గౌరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు జగత్ను అదుపులోకి తీసుకున్నారు.
