Cricket: భారత్–శ్రీలంక మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్, స్పిన్నర్ దీప్తి శర్మ ధాటికి శ్రీలంక బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులకే పరిమితమైంది.
తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బౌలింగ్ను ఎంచుకున్నారు. భారత బౌలర్లు తొలి నుంచే లంక బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చారు. శ్రీలంక ఇన్నింగ్స్లో ఇమేషా దులని (27), హసిని పెరీరా (25), కవిషా దిల్హారి (20) మాత్రమే కొంత ప్రతిఘటన చూపించారు. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో స్కోరు భారీగా పెరగలేదు.
భారత బౌలింగ్లో రేణుకా సింగ్ 4 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి లంక బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చింది. మరోవైపు దీప్తి శర్మ 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించింది. ఈ ఇద్దరూ కలిపి శ్రీలంక జట్టు వికెట్లన్నింటినీ పంచుకోవడం విశేషం.
అనంతరం 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ స్మృతి మంధాన (1) త్వరగా ఔటైనా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ (25*) దూకుడుగా బ్యాటింగ్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం భారత్ 3.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 86 పరుగులు చేయాల్సి ఉంది.
ఈ మ్యాచ్లో భారత జట్టు విజయానికి బలమైన స్థితిలో నిలిచింది.
