Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికలు రసవత్తర పోటీగా మారాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. అయితే పార్లమెంటులోని సంఖ్యాబలం ఇప్పటికే పాలకపక్షానికే అనుకూలంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆగస్టు 19న ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సుదర్శన్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు. “దేశంలో అత్యంత విశిష్టమైన న్యాయవేత్తల్లో ఒకరైన రెడ్డి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా నిలుస్తారు. ఆయన ఆగస్టు 21న నామినేషన్ దాఖలు చేస్తారు,” అని ఖర్గే తెలిపారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ’బ్రైన్ మాట్లాడుతూ, “ఆప్ సహా ప్రతిపక్ష పార్టీలు రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా సమర్థిస్తున్నాయి” అని చెప్పారు.
అయితే లెక్కలు మాత్రం ఎన్డీఏకే కలిసివస్తున్నాయి. ప్రస్తుతం లోక్సభలో 293, రాజ్యసభలో 129తో కలిపి ఎన్డీఏ బలం 422 ఉంది. మరోవైపు ఇండియా బ్లాక్కు కాంగ్రెస్, డీఎంకే, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్), సమాజ్వాదీ పార్టీ, ఎన్సిపి (శరద్ పవార్), సిపిఐ(ఎం), ఆర్జెడి, జెఎంఎం, ఆప్ తదితర పార్టీల మద్దతుతో సుమారు 300 మంది ఎంపీలు ఉన్నారు. ప్రతిపక్షాలు వైఎస్సార్సీపీ (12 ఎంపీలు), బీజేడీ (7 ఎంపీలు) మద్దతు కోరినా, గణాంకాలు ఎన్డీఏ విజయాన్ని నిర్ధారిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Revanth Reddy: మోదీ భజనలో బిజీగా ఉన్న ఎంపీలు..
ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రత్యేకత ఏమిటంటే… రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగా శాసనసభ్యులు ఇందులో పాల్గొనరు. కేవలం లోక్సభ, రాజ్యసభలకు చెందిన 787 మంది ఎంపీలు మాత్రమే ఓటు వేయగలరు. విజయం సాధించడానికి 394 ఓట్లు అవసరం. ఇప్పటికే ఎన్డీఏ ఒంటరిగా ఈ సంఖ్యను దాటేసింది.
అయితే ప్రతిపక్షాలు దీనిని కేవలం సంఖ్యల పోటీగా చూడడం లేదు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, “ఇది సైద్ధాంతిక పోరాటం. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి నిలిచాయి. రాజ్యాంగ విలువలను కాపాడగల వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం ప్రతీకాత్మకం” అని వ్యాఖ్యానించారు.
