pawan kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై తమిళనాడులో ఫిర్యాదు నమోదైంది. మధురైకు చెందిన వంచినాథన్ అనే న్యాయవాది, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతిని భంగం చేయవచ్చని ఆరోపిస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఈ వివరాలను ఓ జాతీయ మీడియా వెల్లడించింది.
అక్టోబర్ 3న తిరుపతిలో జరిగిన వారాహి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, “సనాతన ధర్మాన్ని వైరస్లా భావించే వారే, తాము సనాతన హిందువులమంటున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. ఉదయనిధి స్టాలిన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఉద్దేశించి పవన్ మాట్లాడినట్టుగా ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలపై తమిళంలోనే మాట్లాడిన పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట దుమారం రేపుతున్నాయి.
పవన్ వ్యాఖ్యలను ఖండించిన అడ్వకేట్ వంచినాథన్, వాటిని మైనారిటీల భావోద్వేగాలను దెబ్బతీయడానికీ, మతసామరస్యాన్ని దెబ్బతీయడానికీ ప్రయత్నంగా అభివర్ణించారు. ఈ వ్యవహారంపై స్పందించిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, “వేచి చూడండి… మేమేంటో చూపిస్తాం” అంటూ పవన్కి కౌంటర్ ఇచ్చారు. ఈ ఘటన రాజకీయంగా కొత్త చర్చలకు దారితీయనుంది.