ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ది పథం వైపు నడవాలన్నా..పెట్టుబడులు రావాలన్నా.. ఉపాధి అవకాశాలు కల్పించాలంటే లా అండ్ ఆర్డర్ కీలకమని చెప్పారు.ఇవాళ డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తున్నదని. డ్రగ్స్ వల్ల పంజాబ్ అనేక కష్టాలు ఎదుర్కొంటున్నది. మన రాష్ట్రంలో డ్రగ్స్ ఉత్పత్తి చాలా తక్కువ. డ్రగ్స్ వినియోగం మాత్రం ఇక్కడ క్రమంగా పెరుగుతున్నది. డ్రగ్స్ నివారణకు సరికొత్త చర్యలు తీసుకుంటున్నాం. ఏఐ పరిజ్ఞానం ద్వారా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారిని గుర్తిస్తున్నామని అన్నారు.
నేరగాళ్లను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నాం. పోలీసుల సహకారంతో అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్నాం. శాంతి భద్రతల రక్షణలో పోలీసుల త్యాగాలు సమాజం గుర్తుంచుకుంటుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండటం. పోలీసులు నేరగాళ్లపై కఠినంగా ఉండాలి, ఉక్కుపాదం మోపాలి. ఒక్క శాతం తప్పు జరుగకుండా పోలీసులు వ్యవహరించాలి. పోలీసుల సమస్యలను పరిష్కరించే బాధ్యత మేం తీసుకుంటాం. పోలీసుల పిల్లలకు చదువులు చెప్పించే బాధ్యత తమదని’ చెప్పారు.
అమరులైన కానిస్టేబుల్, ఏఎస్ఐ కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెలిస్తామని సీఎం చెప్పారు. ఎస్ఐ, సీఐ కుటుంబాలకు రూ.కోటీ 25 లక్షలు, డీఎస్పీ, ఏఎస్పీ కుటుంబాలకు రూ.కోటీ 50 లక్షలు, ఎస్పీ, ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్లు పరిహారం ఇస్తామని వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు పరిహారం చెల్లిస్తామన్నారు సీఎం రేవంత్.
