Cm revanth : పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy ఘనంగా పాల్గొని, బాబా సేవా తపస్పుతో దేశానికి చేసిన అపార సేవలను స్మరించారు.
మానవ సేవనే మాధవ సేవగా భావించిన శ్రీ సత్యసాయి బాబా ప్రజలకు ఉచిత విద్య, వైద్య సేవలను అందించి, ప్రభుత్వాలు కూడా చేయలేని స్థాయిలో సేవ చేసిన మహనీయుడని సీఎం పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు పేదల పిల్లలకు ఉచిత విద్య అందించడం, ప్రాణాధార వైద్య సేవలు కల్పించడం వంటి కార్యక్రమాలు బాబాను ప్రజల హృదయాలలో దైవంగా నిలిపాయని అన్నారు.
ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి C. P. Radhakrishnan, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Chandrababu Naidu, త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ—ఈ పవిత్ర నేలలో బాబా నడిచిన అడుగుజాడల్లో పాల్గొనడం తనకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రేమతో, నిస్వార్థంగా, మానవాళి కోసం పనిచేయగలమని బాబా నిరూపించారని అన్నారు. బాబా భౌతికంగా లేకపోయినా, ఆయన ఆత్మ, ఆయన బోధనలు కోట్లాది మందిలో నేటికీ సజీవంగా ఉన్నాయని చెప్పారు.
సత్యసాయి ట్రస్ట్ సేవలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను మించి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో కొనసాగుతున్నాయని, విద్య, వైద్యం, తాగునీటి వంటి రంగాల్లో ఈ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాయని సీఎం ప్రశంసించారు. ప్రత్యేకించి పాలమూరు ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ట్రస్ట్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తుచేశారు.
ట్రస్ట్ సేవలను తెలంగాణలో మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి శతజయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
