CM revanth: నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. విపక్ష నేత సభకు రాకుండా ఉండడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, “ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించనప్పుడు ఆ పదవి ఎందుకు?” అని ప్రశ్నించారు. “మనం ఎన్నుకున్న సర్పంచి గ్రామంలో లేకుంటే ఎలా ఉంటుంది?” అని కేసీఆర్పై తీవ్ర ధ్వజమెత్తారు.
కేసీఆర్ పదేళ్లుగా అధికారంలో ఉంటూ ప్రజలకు మేలు చేయకపోగా, ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మన ప్రజలకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు తీసుకురావాలని ప్రయత్నించాను. కానీ, మాయమాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి పరిశ్రమలు అడ్డుకున్నారు. నా సోదరుడు ప్రజా సేవ చేస్తుంటే ఆయన పట్ల ఓర్వలేకపోతున్నారు. ఏం పదవి ఉందని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం లాగా… సోదరులు, బంధువులకు పదవులు ఇస్తేనే మంచిదా?” అని ఆయన ప్రశ్నించారు.
అలాగే, కేసీఆర్ కుటుంబంలో సోదరులు, బంధువులు అందరికీ పదవులు ఇవ్వడం, దోపిడీ చేయడం గానీ, ఆయన అలాంటి వ్యక్తి కావడం కాదని స్పష్టం చేశారు. “కేసీఆర్ కుమార్తె ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ చేశారు” అని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. “అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న పేదలకు త్వరలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.
“గ్రామ సభల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాం. గతంలో ఎవరైనా ఫాంహౌస్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రజల వద్దకే పాలన వచ్చింది. ఎమ్మెల్యేలు, అధికారులు ప్రజల వద్దకే వెళుతున్నారు. గ్రామాల్లో ప్రజల సమక్షంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ప్రభుత్వం ప్రజల దగ్గరికి వచ్చి దరఖాస్తులు తీసుకుంటోంది. పేదలంతా ఎక్కడున్నా రేషన్ కార్డు తీసుకోవాలి.”
“మా ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎప్పటికీ వెనుకంజ వేయదు. తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ చెప్పారు, ఇచ్చారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేయలేకపోయింది. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలిపోయింది. కాళేశ్వరం కూలిపోయినా, ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది” అని రేవంత్ రెడ్డి వివరించారు.

