Cm revanth: తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సరిగా పని చేయలేదంటూ 16 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, పార్టీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో రెబల్స్ను సమన్వయం చేయడంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు విఫలమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్ సమస్యను సకాలంలో పరిష్కరించకపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు.
అలాగే, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా పార్టీకి తీరని నష్టం కలిగించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారాలు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని ఎమ్మెల్యేలకు అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు
తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 12,733 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు 7,000కు పైగా స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులు 3,502కు పైగా స్థానాల్లో, బీజేపీ 688 స్థానాల్లో గెలుపొందింది
అయితే, కాంగ్రెస్ పార్టీకి పట్టున్న కొన్ని కీలక స్థానాలను కోల్పోవడంపై అధిష్ఠానం సీరియస్గా ఉందని సమాచారం. ఈ క్రమంలో ఎన్నికల్లో సరిగా పనిచేయని వారిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

