Chandrababu Naidu

Chandrababu Naidu: సుపరిపాలనే లక్ష్యం.. స్మార్ట్ వర్కే మార్గం.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల ‘కలెక్టర్ల కాన్ఫరెన్స్‌’ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు కీలక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాలనలో జవాబుదారీతనం, సాంకేతికత వినియోగంపై సీఎం కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

అభివృద్ధికి ‘పి-4’ ఫార్ములా

తొలిరోజు సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) పెరుగుదల మరియు పి-4 (Public-Private-People Partnership) అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌పై సీఎం సమీక్షించారు.

మనం చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు.. స్మార్ట్ వర్క్ చేయడం ద్వారానే మెరుగైన ఫలితాలు సాధించగలం. – సీఎం చంద్రబాబు

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

అధికారులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలని, మంచి ఆలోచన ఎవరి నుంచి వచ్చినా స్వీకరించాలని సీఎం సూచించారు. పాలనలో ఏఐ సాంకేతికతను జోడించి, సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Sonu Sood: 500 మంది మహిళలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించిన సోనూ సూద్

నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని, మనం చేసే పని వల్ల ప్రజల్లో సంతృప్తి కనిపిస్తుందో లేదో గమనించుకోవాలని అధికారులను కోరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

సూపర్ సిక్స్ – సంక్షేమ ప్రస్థానం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘సూపర్ సిక్స్’ పథకాల అమలుపై సీఎం సమీక్షించారు.

  1. పింఛన్లు: పేదల సేవలో భాగంగా ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ.

  2. తల్లికి వందనం: ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు.

  3. అన్నదాత సుఖీభవ: రైతులకు రెండో విడత సాయం అందజేత.

  4. దీపం & స్త్రీ శక్తి: మహిళా సాధికారతకు పెద్దపీట.

  5. ఉద్యోగాల భర్తీ: మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు, అడ్డంకులను అధిగమించి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేశామని సీఎం తెలిపారు.

మెడికల్ కాలేజీలు – పీపీపీ మోడల్‌పై క్లారిటీ

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారాన్ని సీఎం ఖండించారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. పీపీపీ (PPP) మోడల్ వల్ల పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని, దీనిపై తప్పుడు ప్రచారం చేయొద్దని హితవు పలికారు.

గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. రూ.500 కోట్లతో కట్టిన రుషికొండ ప్యాలెస్ ఒక ‘వైట్ ఎలిఫెంట్’గా మారిందని, ఆ నిధులు మెడికల్ కాలేజీలకు కేటాయించి ఉంటే కనీసం రెండు కాలేజీలైనా పూర్తయ్యేవని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *