Chandrababu Naidu: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు బిల్లును ఆమోదించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల ఆకాంక్ష అని, ఈ విజయంతో ప్రతి తెలుగువాడు గర్వంగా తల ఎత్తుకునే రోజు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అమరావతి ప్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి అడుగులోనూ అండగా నిలిచారని, ఈ ఘనత ప్రధానికి మరియు రాష్ట్ర ప్రజలకు దక్కుతుందని ఆయన చెప్పారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. కేవలం తమ ప్రాంతం కోసమే కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తు కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని, వారి పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. ఈ గెలుపును రాజధాని రైతులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతికి గెలవడమే తెలుసు కానీ, ఓడిపోవడం తెలియదని చంద్రబాబు ఉద్ఘాటించారు.
గత వైకాపా ప్రభుత్వం చేసిన ‘మూడు రాజధానుల’ ప్రయత్నాలను చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. జగన్ ఆడిన ఆ ‘మూడు ముక్కలాట’ వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కుట్రలు, దాడులు, విధ్వంసకర పరిస్థితులను తట్టుకుని రాజధానిని కాపాడుకున్నామని చెప్పారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి మరియు ఐకమత్యానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
అమరావతికి ఘనమైన చరిత్ర ఉందని, అందుకే దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయని చంద్రబాబు వివరించారు. అమరావతి నిర్మాణంతో తనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక ఇంజిన్లా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. “చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుంది” అని చెబుతూ, భవిష్యత్తులో దీనిని ప్రపంచ స్థాయి ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.
