CM Chandrababu: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో శనివారం పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం, పారిశుధ్యంపై కీలక ప్రసంగం చేశారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పారిశుధ్యం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి జీవన విధానంగా మారాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ‘స్వచ్ఛ భారత్’ స్ఫూర్తితో రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నామని, గత ప్రభుత్వం వదిలివెళ్లిన 105 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని లెగసీ వేస్ట్ను పూర్తిగా నిర్మూలిస్తామని, చెత్త నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లను విశాఖ, గుంటూరులతో పాటు కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, నెల్లూరు నగరాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
నగరి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి, ఇక్కడ సుమారు 5 వేల ఎకరాల్లో ‘ఎకనమిక్ క్లస్టర్’ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల స్థానికంగా పారిశ్రామికాభివృద్ధి జరగడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అభివర్ణిస్తూ, దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సేవలను ఆయన స్మరించుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తన తండ్రి కంటే మిన్నగా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేసి చూపించామని, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read: Bhatti Vikramarka: టెండర్లు దక్కింది మీ వాళ్లకే.. మళ్ళీ మాపైనే ఆరోపణలా?
పరిశ్రమలు, పారిశుధ్యం విషయంలో సింగపూర్ వంటి దేశాలను స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజలపై రూ. 32,000 కోట్ల భారం వేశారని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాఠశాలల్లో విద్యార్థుల పరిశుభ్రత కోసం ‘ముస్తాబు’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పచ్చగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలని కోరారు. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
