Cm chandrababu: మద్రాస్ ఐఐటీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యార్థులు సీఎం చంద్రబాబుతో తమ సందేహాలను పంచుకున్నారు. ముఖ్యంగా, తెలంగాణలోని కరీంనగర్కు చెందిన సృజన అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నపై చంద్రబాబు ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.
సృజన అడిగిన ప్రశ్న:
“ప్రతి ఇంట్లో టెక్నాలజీ అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఎంఎల్ (మెషీన్ లెర్నింగ్) నేర్చుకోవాలని మీరు పలుమార్లు చెప్పారు. అయితే, ఈ టెక్నాలజీలను మరింత అభివృద్ధి చేసేందుకు మీరు విద్యావ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఐఐటీలను ఈ విధానంలో ఎలా భాగస్వాములను చేస్తారు?” అని సృజన ప్రశ్నించింది.
చంద్రబాబు సమాధానం:
సృజన ప్రశ్న విన్న చంద్రబాబు నవ్వుతూ, “నువ్వు ఎప్పుడు పుట్టావమ్మా?” అని ఆమెను ప్రశ్నించారు. సృజన “1997లో, సర్” అని బదులిచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నువ్వు పుట్టడానికి రెండేళ్ల ముందే నేను ముఖ్యమంత్రిని అయ్యాను. నీది ఏ జిల్లా?” అని అడగగా, సృజన “కరీంనగర్” అని చెప్పింది.
హైదరాబాద్ అభివృద్ధిపై చంద్రబాబు వ్యాఖ్యలు:
అక్కడినుంచి తన ప్రసంగాన్ని కొనసాగించిన చంద్రబాబు, “నువ్వు హైదరాబాద్ను చూసి ఉంటావు. ఎంత అభివృద్ధి చెందిందో తెలుసు కదా! ఎవరికైనా సరే ఆలోచనలు ఉండాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. భవిష్యత్ క్వాంటమ్ కంప్యూటింగ్దే. నేను ఐటీ గురించి పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లోనే ఐటీ అభివృద్ధి గురించి మాట్లాడాను. ఇప్పుడు అదే విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అనేక అవకాశాలు ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.
ఏఐ ప్రాధాన్యం:
“ప్రస్తుతం భారతదేశంలో 68% మంది ఏఐని ఉపయోగిస్తున్నారు. అందరూ తెలిసో, తెలియకో ఏఐను వాడుతున్నారు. Hyderabad ఎవరూ అభివృద్ధి చేశారో తెలుసుకోవాలంటే గూగుల్ అంకుల్ని అడగండి. ఏఐ సాయంతో సమాధానం వస్తుంది. రియల్ డేటా ఉంటే ఏదైనా సాధ్యమే,” అని చంద్రబాబు వివరించారు.
టెక్నాలజీ ఆధారిత జీవనశైలి:
తన శరీరాన్ని పర్యవేక్షించేందుకు తాను టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నానో ఉదాహరణగా చూపుతూ, “ఇప్పుడన్నీ సెన్సార్ల సాయంతో జరిగిపోతున్నాయి. ఉదాహరణకు, ఈ రింగ్ చూడండి. ఇది ఏ పూజారి ఇచ్చిన ఉంగరమో కాదు, ఏ మూఢ నమ్మకాలతో ధరించిన ఉంగరమో కాదు. ఇది ఓ మానిటరింగ్ డివైస్. ఉదయం లేవగానే నా శరీర సంసిద్ధత, స్లీప్ స్కోర్, హార్ట్బీట్ వంటి అనేక అంశాలను ఇది తెలియజేస్తుంది. దాన్ని బట్టి నా రోజును ప్లాన్ చేస్తాను” అని చంద్రబాబు వివరించారు.
చంద్రబాబును మద్రాస్ ఐఐటీలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలు, ఆయన సమాధానాలు టెక్నాలజీ అభివృద్ధిపై కొత్త ఆలోచనలకుప్రేరణగా మారాయి.