AP news: కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మరణించడం పై సీఎం చంద్రబాబు స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో.. ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సైతం దిగ్భ్రాంతి చెందారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో ఇలాంటి ఘటన జరగడం విషాదకరమన్నారు. యువకుల అకాల మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలన్నారు. అలాగే తణుకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి మెరుగైన చికిత్స అందించాలని హోంమంత్రి ఆదేశించారు. ఘటనపై విచారణ చేయిస్తామని తెలిపారు.