CM Chandrababu

CM Chandrababu: సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు..

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ రాజకీయ చర్చనీయాంశంగా మారింది. 2019 మార్చిలో జరిగిన ఈ దారుణ ఘటన సమయంలో పులివెందుల సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన జె. శంకరయ్య, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లీగల్ నోటీసు పంపారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ, అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని, రూ.1.45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నోటీసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలో దారుణంగా హత్యకు గురయ్యారు.  హత్య తర్వాత కేసు స్థానిక పోలీసుల దగ్గర నమోదైంది. తర్వాత సీబీఐకి అప్పగించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుంది. 2025 ఆగస్టులో సీబీఐ విచారణ పూర్తయినట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే, ఈ కేసు ఎన్నికల సమయంలో ఎప్పుడూ రాజకీయ ఆయుధంగా మారుతుంది.

హత్య జరిగినప్పుడు పులివెందుల సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా జె. శంకరయ్య పనిచేశారు. ఘటనా స్థలానికి చేరుకుని మొదటి చర్యలు తీసుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారని, శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేశారని 2019 మార్చి 22న చంద్రబాబు ప్రభుత్వం శంకరయ్యను సస్పెండ్ చేసింది. ఈ ఆరోపణలు అసెంబ్లీలో కూడా పలుమార్లు ప్రస్తావించబడ్డాయి.

Also Read: Pawan Kalyan: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై స్పందించిన పవన్‌..

సీబీఐ విచారణలో శంకరయ్య మొదటి వాంగ్మూలం ఆసక్తికరంగా ఉంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తమపై ఒత్తిడి తెచ్చారని, హత్య కేసు నమోదు చేయకూడదని బెదిరించారని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించకూడదని, గాయాల విషయం ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారని తెలిపారు. అయితే, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేయాల్సిన సమయంలో శంకరయ్య దాటవేసి వెనక్కి తిరిగారు. వేరే పనులు ఉన్నాయని చెప్పారు. సీబీఐ న్యాయస్థానానికి, నిందితుల ప్రభావంతో మాట మార్చారని తెలిపింది. 2021 అక్టోబర్ 6న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. ప్రస్తుతం శంకరయ్య కర్నూలు రేంజ్‌లో వీక్లీ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు.

ఈ నెల 18న న్యాయవాది జి. ధరణేశ్వర్ రెడ్డి ద్వారా చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపారు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు తప్పుడు ప్రకటనలతో తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, నష్టానికి రూ.1.45 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నోటీసు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మరింత ఉద్రిక్తతకు కారణమవుతోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *