AI Cinema

AI Cinema: AI కంట్రోల్ లో మనం ఉంటే ముప్పే.. ‘చిరంజీవి హనుమాన్’ డైరెక్టర్ సంచలన కామెంట్స్

AI Cinema: ప్రస్తుతం సోషల్ మీడియాలో కృత్రిమ మేధ (AI) సృష్టించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే, సినిమాల్లో కేవలం రెండు మూడు నిమిషాల ఏఐ షాట్స్ వాడితేనే ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మరి అలాంటిది సినిమా మొత్తం ఏఐ సాంకేతికతతోనే తీస్తే ఎలా ఉంటుంది? ప్రతి ఫ్రేమ్ ఏఐ సృజనతో ఉంటే ఆ అనుభూతి ఏ స్థాయిలో ఉంటుంది? ఇలాంటి సాహసోపేతమైన అడుగుతో భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమవుతున్నారు నేషనల్ అవార్డు గ్రహీత, దర్శకుడు రాజేష్ మాపుస్కర్.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘హనుమాన్ ది ఈటర్నల్’ అనే చిత్రాన్ని పూర్తిగా ఏఐ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును 2026 ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

యానిమేషన్‌కు, ఏఐకి మధ్య వ్యత్యాసం ఇదే!

తాజా ఇంటర్వ్యూలో రాజేష్ మాపుస్కర్ మాట్లాడుతూ ఏఐ సాంకేతికతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “యానిమేషన్‌లో లైటింగ్ నుండి క్యారెక్టర్ నడక వరకు ప్రతి చిన్న విషయాన్ని మనమే స్వయంగా నిర్ణయించాలి. కానీ ఏఐ అలా కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేయడం అంటే మనతో పాటు మరో మేధస్సు (బ్రెయిన్) పనిచేస్తున్నట్లే. కొన్నిసార్లు మన ఊహకు అందని అద్భుతమైన విజువల్స్‌ను ఏఐ అందిస్తుంది. సృజనాత్మకతలో సరిహద్దులు దాటి (Beyond) ఆలోచించేందుకు ఇది గొప్ప అవకాశాన్ని ఇస్తుంది” అని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి: Thrissur: రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం .. 200 బైకులు అగ్నికి ఆహుతి

ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?

సాంకేతికత పెరిగితే ఉపాధి అవకాశాలు తగ్గుతాయనే ఆందోళనపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. “ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. ఈ సినిమా కోసం నాతో పాటు దాదాపు 200 మంది ఏఐ జనరేటివ్ టీమ్ పనిచేస్తోంది. టెక్నాలజీని మనం ఎలా వాడుకుంటాం అనేదే ముఖ్యం. ఏఐని మనం కంట్రోల్ చేస్తున్నామా లేక మనం ఏఐ కంట్రోల్‌లో ఉన్నామా అనేది కీలకం. మనిషి ప్రమేయం లేకుండా ఏఐ ప్రపంచంలో ఎక్కడా తనంతట తానుగా పనిచేయలేదు. సినిమా విషయంలో కూడా మనిషి సహాయం లేకుండా అద్భుతాలు సృష్టించడం అసాధ్యం” అని ఆయన కుండబద్దలు కొట్టారు.

‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ నేర్పిన పాఠాలు

ఓటీటీ వేదికగా విడుదలైన ‘మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్’ నుండి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని రాజేష్ మాపుస్కర్ తెలిపారు. కొత్త టెక్నాలజీని వాడుతున్నప్పుడు గతంలో వచ్చిన కంటెంట్‌పై ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పాత పొరపాట్లు రిపీట్ కాకుండా, అత్యున్నత ప్రమాణాలతో ‘హనుమాన్ ది ఈటర్నల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *