Mahaa News Exclusive: ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ గని అయిన చీమకుర్తి మరోసారి అక్రమ తవ్వకాలతో వార్తల్లోకిెక్కింది. ఆర్.ఎల్ పురం పరిధిలోని సర్వే నంబర్లు 104, 105లలో ఉన్న సుమారు 17 ఎకరాల ప్రభుత్వ భూమిని మైనింగ్ మాఫియా యథేచ్ఛగా కొల్లగొడుతోంది. జెమ్ (Gem) మరియు ఆనంద్ (Anand) గ్రానైట్స్ సంస్థల పేరుతో ఉన్న లీజుల ముసుగులో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కంపెనీ ఈ అక్రమ దందాను సాగిస్తున్నట్లు మహాన్యూస్ పరిశోధనలో తేలింది. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రభుత్వానికి శఠగోపం పెడుతున్న ఈ కోట్ల రూపాయల కుంభకోణంపై నేడు ‘బ్లాస్టింగ్ స్టోరీ’ని మహా న్యూస్ మీ ముందుకు తెచ్చింది.
లైసెన్స్ ఒకరిది.. మైనింగ్ మరొకరిది!
చీమకుర్తి మండలంలో సాగుతున్న ఈ అక్రమ సామ్రాజ్యంలో నిబంధనలు గాలికి ఎగిరిపోతున్నాయి. లీజు లైసెన్సులు జెమ్ గ్రానైట్స్ మరియు ఆనంద్ గ్రానైట్స్ పేరుతో ఉండగా, క్షేత్రస్థాయిలో మైనింగ్ నిర్వహిస్తోంది మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) అనే సంస్థ.
-
నిబంధనల ఉల్లంఘన: ప్రభుత్వం ఆమోదం లేకుండా లీజుల బదిలీ జరగడం చట్టవిరుద్ధం.
-
ముడుపుల పర్వం: ఈ అక్రమ బదిలీ వెనుక కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారినట్లు సమాచారం.
-
అధికారుల మౌనం: నిబంధనల ప్రకారం అక్రమ లీజులు జరిగితే మైనింగ్ ప్రదేశాన్ని సీజ్ చేయాలి.
జెమ్, ఆనంద్ గ్రానైట్ల చీకటి ఒప్పందాలు
ఆనంద్ గ్రానైట్స్ క్వారీని జెమ్ గ్రానైట్స్ రాయల్టీ కింద తీసుకుని పదేళ్ల పాటు అక్రమ మైనింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
-
హైకోర్టులో కేసు: రూ. 100 కోట్లకు పైగా నిబంధనలను అతిక్రమించి మైనింగ్ జరిగిందని ఇప్పటికే నిర్ధారణ కావడంతో హైకోర్టులో కేసు నడుస్తోంది.
-
ఆర్ఆర్ఆర్ భాగస్వామ్యం: ఇన్ని వివాదాల మధ్య కూడా జెమ్, ఆనంద్ సంస్థలు సంయుక్తంగా ఆర్పీ రవి, పమిడి రవితేజ, సిద్ధా ప్రకాష్ రావు డైరెక్టర్లుగా ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ గ్రానైట్స్కు చట్ట వ్యతిరేకంగా లీజులను అమ్ముకున్నాయి.
-
కార్మికుల ప్రాణాలకు ముప్పు: ఇటీవల బల్లికురవలో జెమ్ గ్రానైట్ రాళ్లు పడి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోరాలు జరుగుతున్నాయి.
చర్యలకు వెనుకాడుతున్నది ఎవరు?
అక్రమ లీజులు నిరూపితమైతే సదరు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలి, యాజమాన్యాలను అరెస్ట్ చేయాలి మరియు వారి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయాలి. కానీ చీమకుర్తిలో ప్రభుత్వం మారుతున్నా మాఫియాలో మాత్రం మార్పు రావడం లేదు.
