Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. పిల్లలను బడికి పంపిన తర్వాత ఒక తల్లి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన పిల్లలు, తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఈరవేణి పరశురాములు, రామవ్వ దంపతుల చిన్న కుమారుడు కృష్ణహరి. ఇతను వీర్నపల్లికి చెందిన రమ్య (32)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు లాస్య (10), ప్రణవ్ (8), నిషాల్ (5). కృష్ణహరి రెండు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అప్పటి నుండి రమ్య తన పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉంటోంది. ఆమె అత్తమామలు మరో కుమారుడితో వేరుగా ఉంటున్నారు.
రమ్యకు తన కుటుంబ సభ్యులతో కొన్ని చిన్నపాటి గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గొడవల వల్ల మనస్తాపానికి గురైన ఆమె, పిల్లలు బడికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది.
Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్..!
సాయంత్రం బడి నుండి తిరిగి వచ్చిన ముగ్గురు పిల్లలు, ఇంటి తలుపు మూసి ఉండటంతో తల్లిని పిలిచారు. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో పక్కింటి వారికి చెప్పారు. వారు వచ్చి తలుపు పగులగొట్టి చూడగా, రమ్య ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఈ దృశ్యం చూసి పిల్లలు “అమ్మ.. అమ్మ..” అంటూ గుండెలు పగిలేలా ఏడ్చారు. వారి రోదనలు చూసి గ్రామంలోని వారందరూ కన్నీరు పెట్టుకున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రమ్య ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆమె మరణంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. తండ్రి విదేశాల్లో ఉండటం, తల్లి ప్రాణాలు కోల్పోవడంతో వారి పరిస్థితి చూసి గ్రామస్తులంతా చలించిపోయారు.
