Chicken: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. కోడి మాంసం తినేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గుంటూరులోని పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్లో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చికెన్ ఫుడ్ మేళాలో ఉచితంగా చికెన్ వంటకాలను పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి హాని ఉండదని ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ అహ్మద్ హాజరై, బర్డ్ ఫ్లూపై అసత్య ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని ప్రజలను బోధించారు.
ప్రజల నుంచి భారీ స్పందన
ఉచితంగా చికెన్ వంటకాలను అందిస్తున్నారని తెలిసిన వెంటనే ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఫుడ్ మేళా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో ప్రజలు చేరడంతో నిర్వాహకులు గేట్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఫుడ్ మేళా ద్వారా ప్రజల్లో భయాన్ని తొలగించి, సురక్షితమైన చికెన్ వినియోగంపై అవగాహన పెంచే ప్రయత్నం విజయవంతమైంది.