Chandrababu సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన ‘పేదల సేవలో’ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— ప్రజలు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో కూటమికి అపూర్వమైన మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. తాను కోరితే 164 సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి తమపై బాధ్యతను మరింతగా పెంచారని చెప్పారు.

 

కొంతమంది ఎగతాళి చేసిన ‘సూపర్ సిక్స్’ సంక్షేమ పథకాలపై మాట్లాడిన చంద్రబాబు— ప్రజల మద్దతుతో వాటిని ‘సూపర్ హిట్’ చేసామని తెలిపారు. గత 18 నెలల్లో కేవలం పెన్షన్లకే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, దేశంలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమానికి వ్యయం చేయడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి పొరుగు రాష్ట్రాలు కూడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు.

 

ప్రతి సంవత్సరం రూ.33 వేల కోట్లు, ఐదేళ్లలో మొత్తంగా రూ.1.65 లక్షల కోట్లు కూటమి ప్రభుత్వం సంక్షేమపథకాలపై ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రతి నెల 63 లక్షల మందికి పైగా పెన్షన్లు అందుతున్నాయని, అందులో 59 శాతం మహిళలేనని వెల్లడించారు. ఎన్టీఆర్ పెన్షన్లను ప్రారంభించగా, తమ ప్రభుత్వం వాటిని గణనీయంగా పెంచిందని గుర్తు చేశారు. గత పాలకులు పెన్షన్‌ను కేవలం రూ.250 మాత్రమే పెంచితే, తాము ఒకేసారి రూ.4,000 పెంచి అమలు చేస్తున్నామని చెప్పారు.

 

తల్లికి వందనం పథకంలో ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. మహిళల భారం తగ్గించేందుకు ఏడాదికి మూడు నెలలు ఉచిత గ్యాస్ సిలిండర్‌లు అందిస్తున్నామని చెప్పారు. రైతులు ధాన్యం విక్రయించిన ఐదు గంటల్లోనే డబ్బులు చెల్లించే విధానం అమలు చేస్తున్నట్టు తెలిపారు.

 

స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత ఆర్టీసీ ప్రయాణ సదుపాయం పొందుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు మహిళలు 25 కోట్ల ప్రయాణాలు చేసారని, దీనికిగాను ప్రభుత్వం ఆర్టీసీకి రూ.855 కోట్లు చెల్లించిందని వెల్లడించారు. అదేవిధంగా 16,347 మందికి డీఎస్సీ ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు అందిస్తున్నట్లు గుర్తు చేశారు.

 

పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.14 వేలు జమ చేశామని తెలిపారు. పంచసూత్రాల ప్రకారం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి రైతును స్వయంగా కలిసి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. త్వరలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి రైతులకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

బాధితురాలికి భరోసా

ఉంగుటూరులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గోపీనాథపట్నం గ్రామానికి వెళ్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుడ్ల నాగలక్ష్మికి స్వయంగా పెన్షన్ అందించారు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి పెద్దమనిషిలా ఆరాతీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నాగలక్ష్మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *