Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సోమవారం ఆబ్కారీ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త బార్ పాలసీ అమలులోకి వస్తుందని ప్రకటించారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని పాలసీలు రూపొందించరాదని సీఎం స్పష్టం చేశారు.
నూతన పాలసీ ముఖ్యాంశాలు:
లాటరీ విధానంలో బార్ లైసెన్సుల కేటాయింపు
లైసెన్స్ ఫీజు:
50,000 లోపు జనాభా గల ప్రాంతాల్లో ₹35 లక్షలు
5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో ₹55 లక్షలు
5 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో ₹75 లక్షలు
ప్రతి బార్కు కనీసం 4 దరఖాస్తులు రావాలి
గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ – లిక్కర్ షాపుల మాదిరిగా బార్లకూ వర్తింపు
లైసెన్స్, అప్లికేషన్ ఫీజుల ద్వారా రాష్ట్రానికి ₹700 కోట్లు ఆదాయం అంచనా
ఆరోగ్యంపై దృష్టి:
మద్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే మద్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యతలేని మద్యం వల్ల అనేక పేద కుటుంబాలు నష్టపోయాయని ఆయన గుర్తుచేశారు.
నాటుసారా నిర్మూలన దిశగా కీలక చర్యలు:
ప్రస్తుతం రాష్ట్రంలో 12 జిల్లాలను ‘డి లిక్కర్ ఫ్రీ’ జిల్లాలుగా ప్రకటించగా, ఈ నెలలో మరో 8 జిల్లాలను అదే కేటగిరీలో చేర్చనున్నారు. సెప్టెంబర్ నాటికి మిగిలిన 6 జిల్లాల్లోనూ నాటుసారా పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.
సరిహద్దుల్లో అమ్మకాలు పెరగడంపై వివరణ:
ఏపీలో మద్యం ధరలు తగ్గడం, అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండటం, నాణ్యత గల మద్యం లభించడంతో సరిహద్దు ప్రాంతాల్లో లిక్కర్ సేల్స్ పెరిగాయని అధికారులు తెలిపారు. గతంలో మంచి బ్రాండ్లు లేక, అధిక ధరల వల్ల ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ సమస్యలు తొలగిపోయాయని వెల్లడించారు.
