Central Govt:తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారమే రిపోర్ట్ చేయాలని వారికి ఆదేశాలను జారీ చేసింది. వారు ముగ్గురూ కీలక శాఖలు నిర్వహిస్తున్న అధికారులు కావడం గమనార్హం.
Central Govt:తెలంగాణ రహదారి భద్రతా అథారిటీ చైర్మన్ అంజనీకుమార్ (1990), తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ (1994), కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి (2011)ని ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2024లో నియమించిన ఖండేకర్ కమిటీ సిఫారసుల మేరకు ప్రస్తుతం ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
Central Govt:2014లో రాష్ట్ర విభజన అనంతరం అఖిల భారత సర్వీసు అధికారులను రెండు రాష్ట్రాలకు డీఓపీటీ కేటాయించింది. అప్పట్లో ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ 10 మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. ఈ అంశంపై డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది.
Central Govt:విభజన సమయంలో ప్రత్యూష సిన్హా కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులను పరిగణనలోకి తీసుకొని ఆ 13 మంది అభ్యర్థనలను పరిశీలించాలని నిరుడు జనవరిలో హైకోర్టు తీర్పును వెలువరించింది. 2024 మార్చిలో ఖండేకర్ కమిటీని నియమించారు. ఈ కమిటీ సిఫారసుల మేరకు గత అక్టోబర్లో కొందరు ఐఏఎస్లను ఏపీకి పంపారు. ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీలో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ఆదేశాలను జారీ చేసింది.