Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ నటుడు, తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్కు భారీ ఊహించని షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ అధికారులు ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేశారు. రేపు, అంటే మార్చి 10వ తేదీన విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో ఈ నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
అసలు ఏం జరిగిందంటే.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ కరూర్లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జనం తాకిడి ఎక్కువగా ఉండటంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సభ నిర్వహణలో లోపాలు ఉన్నాయని, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోలేదని అధికారులు గుర్తించారు.
ఈ కేసు విచారణలో భాగంగా విజయ్ ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే, ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో, వాటిపై స్పష్టత కోసం విజయ్ను మరోసారి విచారించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలను కూడా ఇప్పటికే అధికారులు ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం విజయ్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
