Case On Teacher: కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ 10వ తరగతి విద్యార్థిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో ఆ విద్యార్థి చెవిపోటు పగిలిపోవడంతో పోలీసులు ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటన వివరాలు
ఈ నెల 11న కాసర్గోడ్ జిల్లాలోని కుందంకుళిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఆ రోజున విద్యార్థులు పాఠశాల ఆవరణలో కీర్తనలు పాడుతున్నారు. ఆ సమయంలో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి నేలపై ఉన్న చిన్న గులకరాళ్లతో ఆడుకుంటున్నాడు.
ఇది గమనించిన ప్రిన్సిపాల్ ఆ విద్యార్థిని దగ్గరకు పిలిచి చెంపపై గట్టిగా కొట్టారు. ఆ దెబ్బకు విద్యార్థి నొప్పితో అరుస్తూ ఇంటికి వెళ్లి, చెవి నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరీక్షల్లో ఆ విద్యార్థి చెవిపోటు పగిలిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు ప్రిన్సిపాల్పై చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అంతేకాకుండా, కేరళ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కూడా ఈ కేసును పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శివన్కుట్టి జిల్లా విద్యా అధికారిని ఆదేశించారు.