Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో ఆయన చేసిన ఒక కామెడీ యాక్ట్ ఇప్పుడు పోలీసు కేసు వరకు వెళ్ళింది. ‘కాంతార’ సినిమాలో ఎంతో పవిత్రంగా భావించే దైవిక సన్నివేశాలను రణ్వీర్ వెక్కిరించారనే ఆరోపణలపై బెంగళూరులోని పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
అసలు వివాదం ఏమిటి?
2025లో గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫి) వేడుకల్లో రణ్వీర్ సింగ్ పాల్గొన్నారు. ఆ సమయంలో ‘కాంతార’ సినిమాలో రిషబ్ శెట్టి చేసిన పంజుర్లి, గులిగ దైవాల హావభావాలను రణ్వీర్ సరదాగా అనుకరించారు. అయితే, ఆ సన్నివేశాలను కామెడీగా మార్చడంపై కన్నడిగులు మరియు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రణ్వీర్ ప్రవర్తించారని ఒక న్యాయవాది గత డిసెంబరులో బెంగళూరు కోర్టులో పిటిషన్ వేశారు.
ఇది కూడా చదవండి: Mrunal Thakur: మృణాల్ తమిళ్ ఎంట్రీ ఫిక్స్!
పోలీసు కేసు నమోదు..
కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులోని ‘ది హై గ్రౌండ్’ పోలీస్ స్టేషన్లో రణ్వీర్పై కేసు నమోదైంది. చాముండి అమ్మవారిని భూతంగా పేర్కొనడం మరియు దైవాల వ్యక్తీకరణలను అసభ్యకర రీతిలో అనుకరించడం నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై ఏప్రిల్ 8న కోర్టులో విచారణ జరగనుంది.
రణ్వీర్ వివరణ..
ఈ వివాదం మొదలైనప్పుడే రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. రిషబ్ శెట్టి నటన ఎంత గొప్పదో చెప్పాలనే ఉద్దేశంతోనే తాను అలా చేశానని, ఎవరినీ బాధపెట్టాలని కాదని ఆయన వివరణ ఇచ్చారు. దేశంలోని అన్ని సంప్రదాయాల మీద తనకు గౌరవం ఉందని, తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. అయినప్పటికీ, ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానం వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
