Cargo Ship Attacked: యూఏఈ (UAE) నుంచి భారత్కు వస్తున్న ఒక భారీ కార్గో నౌకపై బుధవారం నాడు హార్ముజ్ జలసంధి సమీపంలో దాడి జరిగింది. థాయ్లాండ్ దేశపు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌక పేరు ‘మయూరీ నరీ’. యూఏఈలోని ఖలీఫా పోర్టు నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుందని థాయ్ నేవీ ధృవీకరించింది. ఈ నౌక గుజరాత్లోని కాండ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంది.
దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 20 మందిని రక్షించినప్పటికీ, మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదు. అదృశ్యమైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అసలు ఈ దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాలపై థాయ్ అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇజ్రాయెల్, అమెరికా చర్యలకు నిరసనగా ఇరాన్ తన పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు వస్తున్న నౌకపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది.
