C P Radhakrishnan: భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ 12న సీపీ రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఎన్నికల ఫలితాలు
సెప్టెంబర్ 10న న్యూఢిల్లీ కొత్త పార్లమెంట్ భవన్లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. మొత్తం 781 మంది ఓటర్లలో 768 మంది సభ్యులు ఓటు వేశారు. ఇందులో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు 452 ఓట్లు రావగా, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. ఈ ఫలితంతో ఆయన 152 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
రాజకీయ ప్రయాణం
1957లో తమిళనాడులోని తిరుప్పూర్లో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1998లో కోయంబత్తూరు నుండి మొదటిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై, 1999లో తిరిగి గెలుపొందారు. బీజేపీలో అనేక పదవులు నిర్వహించిన ఆయన, తరువాత జార్ఖండ్, తెలంగాణ గవర్నర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసి, విద్యా నాణ్యత, గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించారు.
ఇది కూడా చదవండి: Heavy Rains: హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
గవర్నర్గా చివరి సందేశం
మహారాష్ట్ర రాజ్భవన్లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడుతూ, “గత 13 నెలలు నా ప్రజా జీవితంలో అత్యంత సంతృప్తికరమైన సమయాలు. రాజకీయంగా, పరిపాలన పరంగా మహారాష్ట్ర చాలా నేర్పించింది. నేను రాజీపడని జాతీయవాది” అని వ్యాఖ్యానించారు.
శుభాకాంక్షలు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పరాజయం పొందిన ఇండియా బ్లాక్ అభ్యర్థి బి.సుదర్శన్రెడ్డి, బుధవారం కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతిని కలసి అభినందనలు తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో దేశ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయడం దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం కానుంది.