Mahaa Vamsi: హైదరాబాద్లోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ గూండాల దాడి పిరికిపందల చర్య అని మహాన్యూస్ గ్రూప్ ఆఫ్ చానల్స్ సీఎండీ వంశీ విమర్శించారు. వాస్తవాలను జీర్ణించుకోలేకే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతమేనని స్పష్టంచేశారు. దాడికి పాల్పడిన వారు బీఆర్ఎస్ పార్టీ స్లోగన్లు ఇచ్చారని, కేసీఆర్ పేరుతో నినాదాలు చేశారని తెలిపారు. నిరసన తెలపొచ్చు కానీ, రాడ్లు, రాళ్లతో దాడి చేస్తూ, సిబ్బందిపై దాడులు చేయడం దుర్మార్గమని విమర్శించారు.
ప్రజాస్వామ్యయుతంగా జర్నలిస్టులను కలుపుకొని నిరసనను కొనసాగిస్తామని మహాన్యూస్ గ్రూప్ ఆఫ్ చానల్స్ సీఎండీ వంశీ తెలిపారు. దుండగులు కార్లను ధ్వంసం చేశారని, ఆఫీసు అద్దాలు పగులగొట్టారని, సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. తాను తప్పు చేస్తే క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధమేనని, కానీ, ఉన్న వాస్తవాలను తాము చెప్తే దాడులకు దిగడమేమిటని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వాస్తవాలను బయటపెడుతున్నందుకే కొందరు బీఆర్ఎస్ గూండాలు అత్యంత క్రూరంగా తమ కార్యాలయంపై, సిబ్బందిపై దాడులకు దిగారని మహాన్యూస్ గ్రూప్ ఆఫ్ చానల్స్ సీఎండీ వంశీ తెలిపారు. ప్రజాస్వామ్యం ఏమవుతుందని, మీడియాకు స్వేచ్ఛ లేదా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను బయటపెడితే మీడియాను చంపేస్తారా? అని ప్రశ్నించారు. ఇళ్లలో ఉన్న మహిళల ఫోన్లను విన్నారా? లేదా? అని నిలదీశారు.
మహాన్యూస్పై దాడి ఘటనపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వెంటనే స్పందించాలని మహాన్యూస్ గ్రూప్ ఆఫ్ చానల్స్ సీఎండీ వంశీ డిమాండ్ చేశారు. సంబంధం ఉంటే ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో చెప్పాలని, ఒకవేళ సంబంధం లేకుంటే లేదనే విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపితే తాము కూడా సమాధానం చెప్పేవాళ్లమని చెప్పారు. ఈ దాడి ఘటనపై పోరాటాన్ని కొనసాగిస్తామని, త్వరలో కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.
