KTR Shade: జరిగింది మీడియా చానల్పై దాడి. బీఆర్ఎస్ మూక దాడిని చానల్ సిబ్బంది చేతిలోని కెమెరాలు, సీసీటీవీలు స్పష్టంగా బంధించాయి. కానీ బరితెగించిన బీఆర్ఎస్ చేసుకుంటున్న ప్రచారం ఏమిటో తెలుసా. తమ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మహాన్యూస్ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చారట. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న క్రమంలో వారిపై మహాన్యూస్ యాజమాన్యం దాడికి పాల్పడిందట. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తలకే గాయాలు అయ్యాయట. ఇంతకంటే బరితెగింపు మరెక్కడైనా ఉంటుందో లేదో మరి. వాస్తవాలను భరించలేక చేసిన దాడి. అందులోనూ వాస్తవాలను వక్రీకరిస్తూ చేసుకుంటున్న ప్రచారం. మీడియాపై హత్యాయత్నానికి తెగబడ్డప్పుడే ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ చచ్చిపోయింది. కానీ రౌడీయిజం, గూండాయిజం ప్రవేశపెడతాం… ఎవరినైనా భయపెడతాం… మీడియా గొంతు నొక్కుతాం… అనుకుంటే బీఆర్ఎస్ని ఎవరూ బతికించలేరని కూడా తెలుసుకోవాలి.
ఇక బీఆర్ఎస్ పెయిడ్ మీడియా, ఆ పార్టీ సోషల్మీడియా అరాచకం ఇలా ఉంటే.. నింపాదిగా స్పందించిన ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన మరీ అసహ్యంగా ఉంది. ప్రజా స్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు అంటూ సన్నాయి నొక్కులతో మొదలుపెట్టిన కేటీఆర్… ఈ దాడికి పాల్పడింది తన సైన్యమేనని ఇండైరెక్టుగానే అంగీకరించారు. తనపై ప్రేమతోనే తమ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని అర్థమొచ్చేలా కేటీఆర్ ట్వీట్ చేశారు. అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదు అంటూ నీతి వ్యాఖ్యాలు వల్లె వేసిన కల్వకుంట్ల జూనియర్ రావు… దిగజారుడు రాజకీయాలను మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చాడు గుంపు మేస్త్రీ అంటూ సీఎం రేవంత్ని ఇందులోకి లాగారు. దాడికి పాల్పడిన రౌడీ మూకని తన సోదరులుగా చెప్పుకొచ్చిన కేటీఆర్… ఏం జరిగినా భయపడొద్దని, లీగల్గా ఎదుర్కొందామని వారికి భరోసా కూడా ఇచ్చారు. మీడియాపై మర్ఢర్ ఎటాక్ చేసిన ఈ సోకాల్డ్ ప్రజా నాయకుడు… ఈ స్థాయి దాడిని తక్కువ చేస్తూ.. పైగా తమపై బురదజల్లడానికే మహాన్యూస్ కథనాలను ప్రసారం చేస్తోందని, అందుకు గౌరవనీయ న్యాయస్థానాలను ఆశ్రయిద్దామంటూ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. రేవంత్ని, రేవంత్ సర్కార్ని ఇందులోకి లాగడం ద్వారా…. మహాన్యూస్ మీడియాకు రాజకీయ బురద అంటించి, ఇష్యూని పక్కదారి పట్టించే నక్క జిత్తులకు తెరలేపారు కేటీఆర్.
ఈ మొత్తం వ్యవహారం.. ఈ అమానవీయ దాడి, హేయమైన దుశ్చర్య… కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్న అనుమానాలను కూడా మహాన్యూస్ యాజమాన్యం వ్యక్తం చేస్తోంది. మీడియా బాధ్యతగా కథనాలను ప్రసారం చేసిన మహాన్యూస్పై వ్యక్తిగతంగా కేటీఆర్ కక్ష ఎందుకు పెంచుకున్నారో ఆయనకే తెలియాలి. కానీ ఈ తరహా రౌడీ రాజకీయాలతో జర్నలిజం నోరు నొక్కలేరని బలంగా చెప్పదలుచుకుంది మహాన్యూస్. బీఆర్ఎస్ మూకల హత్యాయత్నంపై న్యాయ పోరాటానికి సిద్ధమౌతోంది.