Aashadam Bonalu 2025: సికింద్రాబాద్, భాగ్యనగరంలో ఎంతో ఘనంగా జరుపుకునే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఈరోజు, జూన్ 26, 2025 నుండి ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలోని ప్రసిద్ధ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ నెల రోజుల పాటు జరిగే బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.
జంట నగరాల్లో బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల సౌకర్యార్థం, ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లంగర్ హౌస్ చౌరస్తాలో ఫలహారం బండి, తొట్టెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also Read: Kanwar Yatra: రెచ్చగొట్టే నినాదాలు చేస్తే ఊరుకోమ్.. యోగి కీలక నిర్ణయం
Aashadam Bonalu 2025: ఉదయం 8 గంటలకు గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొలి బోనాలలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. అలాగే, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొదటి బోనాన్ని సమర్పిస్తారు.
లంగర్ హౌస్ నుండి గోల్కొండ బడా బజార్ వరకు అమ్మవారి ఊరేగింపు వైభవంగా సాగుతుంది. పూజారి ఇంటి నుండి అమ్మవారిని భక్తులు గోల్కొండ జగదాంబిక ఆలయానికి తీసుకెళ్తారు. బోనాల ఉత్సవాలు నెలరోజుల పాటు కొనసాగుతాయి. ఈ సమయంలో భక్తులు ప్రతి గురువారం, ఆదివారాల్లో అమ్మవారికి తమ మొక్కులను సమర్పించుకోవచ్చు. బోనాల ఉత్సవాలతో భాగ్యనగరం భక్తి పారవశ్యంలో మునిగి తేలనుంది.