Bomb Threat: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) వరుస భద్రతా సవాళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్న ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుండి, కేరళలోని కొచ్చి నుండి వస్తున్న ఈ రెండు విమానాల్లో ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ (RDX) పేలుడు పదార్థాలను ఉంచామని, అవి ఏ క్షణమైనా పేలిపోవచ్చని గుర్తుతెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు. ఈ సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ భద్రతా యంత్రాంగం అప్రమత్తమై, అత్యవసర ప్రోటోకాల్ను అమలు చేసింది.
Also Read: Team India: టీమిండియా టెస్టు కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్? గంభీర్పై వేటు తప్పదా?
శంషాబాద్లో విమానాలు దిగిన వెంటనే అధికారులు వాటిని సాధారణ టెర్మినల్స్ వద్దకు కాకుండా ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ బేలకు తరలించారు. ప్రయాణికులను సురక్షితంగా దించివేసిన తర్వాత, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి విమానమంతా క్షుణ్ణంగా సోదాలు చేశాయి. మరోవైపు, కోల్కతా నుంచి వస్తున్న మరో ఇండిగో విమానానికి సంబంధించి కూడా ఒక విచిత్రమైన సమస్య ఎదురైంది. విమానం గాలిలో ఉండగానే, రన్వేకు దాదాపు ఏడు నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు దానిపైకి లేజర్ లైట్లు వేయడం కలకలం రేపింది.
మొయినాబాద్, చిలుకూరు బాలాజీ వైపు నుంచి విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ లేజర్ వెలుతురు కనిపించిందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ఫిర్యాదు చేశారు. విమానం దిగే సమయంలో ఇలాంటి కాంతి కిరణాలు పైలట్ దృష్టిని మళ్లించి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున అధికారులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వరుసగా బాంబు బెదిరింపులు, లేజర్ లైట్ల కలకలంతో ఎయిర్పోర్ట్ వద్ద భద్రతను అత్యున్నత స్థాయికి పెంచారు. పోలీసులు ఈ బెదిరింపు మెయిల్స్ మూలాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
