Bomb Threat: హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో గురువారం ఉదయం ఒక్కసారిగా బాంబు బెదిరింపు కలకలం రేగింది. నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు రావడంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు, నాంపల్లి కోర్టు పరిసరాలను తమ నియంత్రణలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు కోర్టు భవనంలోని వారందరినీ హుటాహుటిన బయటకు పంపించి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS), డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సంఘటనతో కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోర్టు వద్దకు పోలీసులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
