Bhatti Vikramarka: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన, తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాల్సిందిగా చంద్రబాబును ప్రత్యేకంగా కోరారు. ఈ సందర్భంగా పెళ్లి పత్రికను అందజేసి, వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానించారు.
భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీ సీఎం చంద్రబాబు వీరిద్దరికీ సాదర స్వాగతం పలికారు. తెలుగు సంప్రదాయం ప్రకారం వారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికలుగా వేంకటేశ్వరస్వామి ప్రతిమలను బహూకరించారు. ఉభయ రాష్ట్రాల నేతల మధ్య ఈ భేటీ ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
అంతకుముందు, భట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులను కూడా కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్లతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులకు కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. అనంతరం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి, సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజును కలిసి శుభలేఖ ఇచ్చారు.
