Bhatti vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ షేరింగ్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ లేదని స్పష్టం చేశారు. తమంతట మేము అందరం కలసి, టీమ్ వర్క్తో పనిచేస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న భట్టి విక్రమార్క గురువారం మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వారి మాటలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ప్రజల్లోకి వెళ్లడం లేదని గుర్తుచేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పారు.
ఫోర్త్ సిటీ – మూసీ ప్రాజెక్టులపై స్పష్టత
ఫోర్త్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని, మూసీ నది సుందరీకరణ కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని భట్టి తెలిపారు. గాంధీ ఘాట్ వరకు ఈ పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
సన్నబియ్యం, ఉచిత బస్సుపథకంపై స్పందన
ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం విజయవంతమైందని చెప్పారు. గత ప్రభుత్వంలా ఈ కార్యక్రమం దారి తప్పలేదని తెలిపారు. అలాగే, మహిళలకు ఉచిత బస్సు పథకానికి అద్భుత స్పందన వస్తోందని, అదనంగా మరో మూడు వేల బస్సులు కొనుగోలు చేసే ప్రక్రియలో ఉన్నామని వెల్లడించారు.
సిగాచి ప్రమాదంపై స్పందన, రుణమాఫీ విధానం
సిగాచి పరిశ్రమ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని చెప్పారు. రుణమాఫీ విషయంలో రూ.2 లక్షలు దాటిన వారికి మాఫీ లేదన్నది విధానపరమైన నిర్ణయమని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాల స్థితిని పరిశీలించి రుణమాఫీ అమలు చేశామని వివరించారు.
