Bhatti vikramarka: మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
“గత ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల అప్పులు చేశారు. కానీ ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. మాపై విమర్శలు చేసే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రండి. ప్రెస్ క్లబ్ కాదు, అసెంబ్లీ వేదికే సరైనది. అక్కడే అన్ని లెక్కలతో చర్చిద్దాం.”
కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన భట్టి “మీరు పాలనలో ఉన్నప్పుడు విద్యుత్ వినియోగం ఎంత? ఇప్పుడు డిమాండ్ పెరిగినా ఎక్కడా కోతలు లేవు. మళ్లీ అలాంటి మాటలే మాట్లాడితే, ఈసారి డిపాజిట్ కూడా దక్కదు” అని తీవ్రంగా హెచ్చరించారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా భట్టి విక్రమార్క ప్రస్తావించారు.“రుణమాఫీ చేశాం, 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతులకు ఇచ్చాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. ఇది అంతా చూసి భరించలేని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు” అని మండిపడ్డారు.
అంతేకాక, సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండిస్తూ –“నదుల బేషన్లు కూడా తెలియవంటారా? ఇది ఎలాంటి విమర్శ?” అంటూ బీఆర్ఎస్ నేతలపై ధ్వజమెత్తారు.
“కేసీఆర్ అసెంబ్లీకి రండి. ప్రజల ఎదుట మాట్లాడుకుందాం. ప్రెస్ క్లబ్లో కాదు – ప్రజాప్రతినిధుల సభలో సరైన చర్చ జరగాలి” అని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.
