Hyderabad: రాష్ట్ర వ్యాప్తంగా 85% సర్వే పూర్తయిందని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. జంట నగరాలు తప్ప మిగతా జిల్లాల్లో 85 నుంచి 90 శాతం పూర్తి అయిందని, ఇందులో మహబూబ్నగర్లో 94 శాతం, వనపర్తి జిల్లాలో 88 శాతం, నాగర్కర్నూల్లో 84.2 శాతం, జోగులాంబ గద్వాలలో 94 శాతం, నారాయణపేటలో 92.5 శాతం సర్వే పూర్తైందని వివరించారు. సమగ్ర కుటుంబ సర్వేలో తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందన్నారు. సర్వేలో సేకరించిన సమాచార కాపీలను భద్రపరుస్తామన్నారు.
సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పలువురు సర్పంచ్ల నుంచి వినతులు వచ్చాయన్నారు. విచారణలో వచ్చిన అప్లికేషన్లు, అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.చాలా మంది స్టూడెంట్లు ఉన్నత చదువుల కోసం మహబూబ్నగర్కు వస్తారని, వారి కోసం రెండు హాస్టల్స్ ఏర్పాటు చేయాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే కోరారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.