Basara Godavari: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర.. ఆత్మహత్యలకు అడ్డాగా మారుతోంది. ఒక ఘటన మరువకముందే.. మరో ఘటన చోటుచేసుకుంటుంది. ఏ చిన్న కష్టం వచ్చినా చుట్టుపక్కల గ్రామాల ప్రజల గోదావరి నదిలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో నష్టాలు, అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు భరించలేక ఓ కుటుంబం గోదావరి నదిలో దూకింది. బాసర పుణ్యక్షేత్రంలో నదీ స్నానం కోసమని దిగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు గమనించి స్పందించేలోగా తండ్రీకూతుళ్లు నీళ్లలో గల్లంతయ్యారు. తల్లిని మాత్రం కాపాడి ఒడ్డుకు చేర్చారు.
ఇది కూడా చదవండి: Kadapa SP Transfer: కడప ఎస్పీ ఆకస్మిక బదిలీ..
Basara Godavari: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్ లో ఉప్పలించి వేణు, అతడి భార్య అనురాధ, కూతురు పూర్ణిమ ఉంటున్నారు. వేణు స్థానికంగా చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యాపారం కోసం గంజ్ మార్కెట్ లోని వ్యాపారస్తులు రోషన్, వికాస్ ల దగ్గర వేణు రూ.3 లక్షలు అప్పు చేశాడు. ఈ మొత్తానికి వడ్డీ, చక్రవడ్డీ కట్టాలంటూ రోషన్, వికాస్ లు వేధింపులకు దిగారు. డబ్బులు చెల్లించకపోతే మనుషులను పంపించి వేణు భార్య, కూతురులను వివస్త్రలను చేస్తామని బెదిరించారు.
ఓవైపు వ్యాపారం అనుకున్నంత బాగా జరగకపోవడం, మరోవైపు వీరి వేధింపులు.. ఈ క్రమంలో వేణు మనస్తాపానికి గురయ్యాడు. భార్యాబిడ్డలతో కలిసి ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా బాసర చేరుకుని గోదావరిలో దూకారు. కాగా, స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డ అనురాధ అప్పుల వాళ్ల వేధింపులను బయటపెట్టింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.