Bandi sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.తాను బీజేపీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారంటూ జరుగుతున్న ప్రచారం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. కొన్ని శక్తులు తప్పుడు ప్రచారం చేసి తనకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ నాయకత్వం తనకు పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు.
పార్టీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. బీజేపీలో సమష్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారని చెప్పారు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని తెలిపారు. కాగా, మళ్లీ తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దీనిపై బండి సంజయ్ స్పందించారు.

