Bandi sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పదవుల విషయంలో బీజేపీ కులాలను పరిగణనలోకి తీసుకోదని స్పష్టం చేశారు. ఏకవ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకునే పరిస్థితి లేదని తెలిపారు.
బీజేపీలో ఏదైనా సమస్య ఉంటే, దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, బహిరంగంగా మాట్లాడటం సరైన విధానం కాదని బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో తాను మరియు లక్ష్మణ్ బీసీ కోటాలో పార్టీ అవకాశాలు పొందిన విషయాన్ని గుర్తు చేస్తూ, పార్టీ అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు.
కాగా, ఇటీవల తాను పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని రాజాసింగ్ కామెంట్ చేశారు. పార్టీకి తన అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు.బీజేపీని వదిలి వెళ్లేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు తనకు బ్రోకరిజం చేయడం రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ-గోషామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే.. కనీసం తనను పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఫైర్ అయ్యారు.
అలా చేశారని పార్టీలో ఉన్న ఓ ముఖ్య నేతను ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నానని అన్నారు. గోల్కొండ-గోషామహల్ జిల్లా అధ్యక్ష పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

