Bandi sanjay: తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.35.19 కోట్లు కేటాయించడం హర్షణీయమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిఫారసుతో ఈ నిధులు మంజూరు కావడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.
కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 96 గదుల సత్రం నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ సత్రం పూర్తయితే లక్షలాది మంది భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, గతంలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బండి సంజయ్ విమర్శించారు. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలయ అభివృద్ధికి నయా పైసా కేటాయించకపోగా, ఆర్జిత సేవల ఛార్జీలను పెంచి భక్తులపై అదనపు భారం మోపుతోందని ఆరోపించారు.
భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొండగట్టు ఆలయానికి తగిన నిధులు కేటాయించి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
టీటీడీ నిధులతో నిర్మించనున్న సత్రం ద్వారా కొండగట్టు దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యాలు కలగనున్నాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.
