Swetcha Suicide: తెలుగు న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ వొటేర్కర్ ఆత్మహత్య ఇటీవల సంచలనం రేపింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న స్వేచ్ఛ, కవిత్వం రాయడం, సామాజిక సమస్యలపై గళం విప్పడంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె బలవన్మరణం జర్నలిస్టు వర్గాలను షాక్కు గురిచేసింది. వయసు మీద పడ్డ తల్లిదండ్రులు, 13 ఏళ్ల కూతురును వదిలి ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం సన్నిహితులను కలిచివేసింది. స్వేచ్ఛ మృతికి పూర్ణ చందర్ అనే వ్యక్తే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. పూర్ణ చందర్ స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు చెబుతున్నారు. అతడికి బీఆర్ఎస్ అగ్రనేతలతో సంబంధాలున్నాయని, టీ న్యూస్లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా బీఆర్ఎస్ నేత సంతోష్ రావు సిఫారసుతో ఉద్యోగం పొందాడని సమాచారం. సోషల్ మీడియాలోనూ చాలామంది పూర్ణ చందర్పై ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: PM Modi: మోడీ సొంత గ్రామంలో గ్రీకు చక్రవర్తి నాణేలు లభ్యం
Swetcha Suicide: పూర్ణ చందర్ శనివారం రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆత్మహత్యకు ప్రేరేపణ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే, స్వేచ్ఛ సూసైడ్ నోట్ రాయకపోవడంతో అరెస్టు వాయిదా పడింది. అనూహ్యంగా, స్వేచ్ఛ కూతురు పూర్ణ చందర్పై వేధింపుల ఆరోపణలు చేయడంతో పోక్సో కేసు నమోదై, అతడిని అరెస్టు చేశారు. పూర్ణ చందర్ విడుదల చేసిన లేఖలో 2009 నుంచి స్వేచ్ఛ తనను తెలుసని, ఒక టీవీ ఛానెల్లో కలిసి పనిచేశామని, 2020 తర్వాత సాన్నిహిత్యం పెరిగిందని చెప్పాడు. స్వేచ్ఛ మొదటి భర్త నుంచి 2009లో, రెండో భర్త నుంచి 2017లో విడాకులు తీసుకుందని, తనను భర్తగా ఊహించుకుందని అతను పేర్కొన్నాడు. స్వేచ్ఛ మానసిక బాధలకు తల్లిదండ్రులే కారణమని, తరచూ వారితో గొడవలు జరిగేవని ఆరోపించాడు. 2020లో స్వేచ్ఛ తల్లిదండ్రుల నుంచి విడిపోయి కవాడిగూడలో ఇల్లు తీసుకుందని, కూతురి బాధ్యతలను తనకు అప్పగించిందని చెప్పాడు. అయితే, స్వేచ్ఛ కూతురు అతడి ప్రవర్తన సరిగాలేదని ఆరోపించింది. స్వేచ్ఛ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పరిశీలనలో మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలతో పూర్ణ చందర్ ఫోటోలు వైరల్ కావడంతో ఈ వ్యవహారం రాజకీయ కోణం తీసుకుంది.