Pk-Shammi Phone Tap: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ రగడకు కేంద్రబిందువైంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. షర్మిలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లపై కూడా నిఘా ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత గోప్యంగా, కోడ్ ల్యాంగ్వేజ్ని ఉపయోగించి షర్మిల సంభాషణలను రికార్డ్ చేసి, “అన్నకు” అదేనండి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్లు ఆధారాలు బయటపడ్డాయంటూ ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
షర్మిల మాట్లాడిన ప్రతి వ్యక్తిపై నిఘా పెట్టి, ఆమె సన్నిహితులను పిలిపించి ఓ సీనియర్ పోలీసు అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారట. షర్మిలకు తన ఫోన్లు ట్యాప్ అవుతున్న విషయం అప్పట్లోనే తెలిసి, అప్రమత్తమైనట్లు సమాచారం. ఆమె వద్ద ఈ వ్యవహారంపై కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. మరో సంచలనంగా, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు వెల్లడవుతోంది. జగన్ ఆదేశాల మేరకు పవన్ సంభాషణలను రికార్డ్ చేసి, ఆయన రాజకీయ వ్యూహాలను తెలుసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో ఈ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం.
Also Read: Yoga Day Special Story: యోగాతో రికార్డు సృష్టిస్తుందా ఏపీ?
Pk-Shammi Phone Tap: ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన అధునాతన టెక్నాలజీతో ఈ ట్యాపింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారం చేతులు మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసు విచారణకు ఆదేశించగా, సిట్ విచారణలో ప్రభాకర్ రావు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి అధికార బీఆర్ఎస్ మద్దతుతో ఏపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసింది నిజమేనని ప్రభాకర రావు అంగీకరించినట్లు కూడా చెబుతున్నారు. ఈ విషయాలు బయటకు రావడంతో జగన్, బీఆర్ఎస్ నాయకత్వం మధ్య ఈ ట్యాపింగ్ కోసం ఒప్పందం జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు రెండు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
షర్మిల, పవన్ లాంటి ప్రముఖ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టడం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? ఈ సమాచారం ఎలా ఉపయోగించబడింది? తెలంగాణ సిట్ విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. చివరికి ఈ కేసు రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.