Pawan Erramatti Dibbalu: ఆంధ్రప్రదేశ్ లోని ఎర్ర మట్టి దిబ్బలు అరుదైన గుర్తింపు దక్కించుకున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేరాయి. వీటి పటిష్టతకు, భద్రతకు ప్రభుత్వాలు ఇకపై తీసుకునే చర్యలను బట్టి.. అసలు జాబితాలో స్థానం పొందే అవకాశం ఉంది. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. వైసీపీ హయాంలో ఈ ఎర్రమట్టి దిబ్బలు ప్రమాదంలో పడ్డాయన్న ఆరోపణలు రాగానే.. పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. అరుదైన ఎర్రమట్టి దిబ్బలు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన పవన్.. ప్రభుత్వం వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పవన్ సూచనలను పరిగణలోకి తీసుకుంది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వీటికి అరుదైన గుర్తింపు దక్కినట్లు తెలుస్తోంది.
Also Read: PM Modi: నేపాల్కు భారత్ పూర్తి మద్దతు: కొత్త ప్రధాని సుశీలాతో మోదీ సంభాషణ
విశాఖ సమీపంలోని తీరం వెంబడి 1500 ఎకరాలలో ఈ ఎర్రమట్టి దిబ్బలు విస్తరించి ఉన్నాయి. ఇసుక, సిల్ట్, బంక మట్టి మిశ్రమంతో కూడిన ఎర్రమట్టి దిబ్బలు… వేల సంవత్సరాల్లో సహజ ఆక్సీకరణ ఫలితంగా ప్రత్యేకమైన ఎర్రటి రంగులోకి రూపాంతరం చెందాయి. ప్రపంచంలో ఇలాంటివి మరో రెండు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎర్రమట్టి దిబ్బలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వైసీపీ హయాంలో ఎర్రమట్టి దిబ్బలు ధ్వంసం అవుతున్నాయని, వారసత్వ సంపదని పర్యాటకం పేరుతో ధ్వంసం చేస్తున్నారనీ, వెంటనే విధ్వంస చర్యలు నిలుపుదల చేయకుంటే.. జనసేన ఉద్యమిస్తుందని హెచ్చరించారు. పవన్ హెచ్చరికలతో అప్పటి వైసిపి ప్రభుత్వం దిగొచ్చి.. కొన్ని రక్షణ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకోవడంపై అంతటా హర్షం వ్యక్తం అవుతోంది.