Kuppam ki Babu Varam: రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నాడు ఎన్టీఆర్ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే…ఆయన కలను చంద్రబాబు సాకారం చేస్తున్నారు. సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు. సీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లూ కల.. కానీ ఇప్పుడు అది నిజం. ఈ కలను చంద్రబాబు నిజం చేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది మొదటి నుంచి తెలుగు దేశం పార్టీ సంకల్పం. సీమలో ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్ అయితే… వాటిని ముందుకు తీసుకువెళ్లి ఆ కలను నిజం చేసింది చంద్రబాబు నాయుడు. అతి తక్కువ వర్ష పాతం ఉండే సీమ జిల్లాల్లో నీళ్లతోనే సీమ ప్రజల స్థితిగతులు మారుతాయని ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో హంద్రీ నీవాకు ఉమ్మడి రాష్ట్రంలో 1999 జులై 9 చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ రోజు బీడు భూముల్లో నీళ్లు పారేలా చేశారు.
ఇదంతా రాత్రికి రాత్రి ఇది జరగలేదు. 2014 నుంచి నేటి వరకు ప్రభుత్వం భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులపై నిధుల ఖర్చు చేయడం వల్ల నేడు హంద్రీనీవా నీళ్లు చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు చేరాయి. హంద్రీనీవా ప్రాజెక్టుపై 2014-19 మధ్య రూ.4,183 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సీజన్లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లో మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచారు. సాగు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ చెబుతారు. చెప్పడమే కాదు.. దాన్ని చేసి చూపించాలన్న సంకల్పంతోనే రికార్డు స్థాయిలో చేపట్టిన హంద్రీ-నీవా కాల్వ విస్తరణ పనులతో సీమకు జలకళ వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతోంది. విస్తరించిన కాల్వల ద్వారా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ 19 నియోజకవర్గాలను తాకింది. 10 రిజర్వాయర్లను నింపుతోంది.
Also Read: K.lakshman: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం
హంద్రీనీవా ఆయకట్టులో చిట్ట చివరి జిల్లా చిత్తూరు. చిత్తూరు జిల్లాలో 16 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా… కేవలం 6 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. మిగిలిన 10 లక్షల ఎకరాలకు సాగునీరిస్తే… రైతన్నకు నీటి కొరతే ఉండదు. హంద్రీనీవా రెండో దశ పనులు పూర్తి చేసి జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రభుత్వం ఇవ్వనుంది. చిత్తూరు జిల్లాలో సాగు అంతా బోర్లపైనే ఆధారపడి ఉంది. 565 కి.మీ. మేర ఉన్న పుంగనూరు, నీవా, తంబళ్లపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయల్పాడు, సదుం బ్రాంచ్ కాలువలతో 1,86,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది. మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేశారు. నాటి నుంచి హంద్రీనీవా కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మ 738 కి.మీ ప్రయాణించి కుప్పానికి చేరింది. పరమ సముద్రంలో సిఎం చంద్రబాబు కృష్ణా జలాలకు హారతి ఇవ్వగా.. కుప్పం నియోజకవర్గంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
215 క్యూసెక్కుల సామర్ధ్యంతో 123 కి.మీ. పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. రూ.197 కోట్లతో కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ వెళ్తుంది. ఈ కాలువ ద్వారా 4 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వడమే కాకుండా… 110 చెరువులు నింపడం ద్వారా 6,300 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. ప్రభుత్వ చిత్తశుద్ది సంకల్పంతో 40 టిఎంసిల నీటిని ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయల సీమ జిల్లాలు వినియోగించుకోనున్నాయి. చెరువుల అన్ని నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దీంతో సీమలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. ఉద్యాన పంటల ఉత్పత్తులు పెంచేందుకు సాగునీటి సౌకర్యం ఎంతో దోహదం చేయనుంది. ఈ ప్రాంత రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరగనున్నాయి.