Kavita Rao Leaks: కవిత రావ్ లీక్స్… సిరీస్ స్టార్ట్ అయ్యిందా? హరీశ్ రావే మెయిన్ టార్గెటా? తాను చెప్పిన దెయ్యాలు ఎవరో మరోసారి క్లారిటీ ఇచ్చారు కవిత. సంతోష్రావును కూరలో ఉప్పు, చెప్పులో రాయితో పోల్చిన కవిత.. హరీశ్రావే మెయిన్ విలన్ అంటోంది. కేసీఆర్, కేటీఆర్లకు హరీశ్ కట్టప్పలా వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తోంది. పార్టీని హస్తగతం చేసుకోవాలని హరీశ్రావు కుట్ర చేశారంటూ కూడా సంచలన ఆరోపణ చేస్తున్నారామె. గత ఎన్నికల్లోనూ హరీశ్ రావు కుట్రలు కొనసాగాయని, కాళేశ్వరంలో అవినీతితో పెద్ద ఎత్తున పోగేసుకున్న డబ్బులతో హరీశ్ రావు పాతిక మంది సొంత ఎమ్మెల్యే అభ్యర్థులను తన వైపు తిప్పుకున్నారనీ ఆరోపించారు. హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదు, ఆయనో బబుల్ షూటర్ అని, రేవంత్కి పూర్తిగా సరెండర్ అయ్యాడని.. హరీశ్ మీడియా మేనేజ్మెంట్, అతనికున్న తెలివితేటలు తన అన్న రామన్నకు లేవని తేల్చేశారు. మొత్తంగా.. అన్న అసమర్థుడు, నాన్న అమాయకుడు అన్న విధంగా కవిత మాటలు ఉండటం విశేషం.
“దుబ్బాకలో బీఆర్ఎస్ను ఓడించింది హరీశ్ రావే. సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించాలని ప్లాన్ చేసిందీ హరీశ్ రావే. ఇక సంతోష్ రావు ఒక మేక వన్నె పులి. అతనికి తోడు నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తోడయ్యారు. మేఘా కృష్ణారెడ్డితో కలిసి మోకిలాలో విల్లాలు నిర్మించి పెద్ద ఎత్తున అవినీతి చేశారు. వీరి అవినీతిపై రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలి. వీరంతా దెయ్యాలు, జలగలు, కట్టప్పలు, దుష్టశక్తులు, మేకవన్నె పులులు..” అంటూ హరీశ్రావు, సంతోష్ రావులపై కవిత రావు ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయనీ, కేటీఆరే ఫోన్ ట్యాపింగ్ చేయించారని అంతా అనుకుంటున్నారు కానీ.. నిజానికి కేటీఆర్ కుటుంబ సభ్యలు, సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని కవిత మరో బాంబు పేల్చారు. ఫోన్ ట్యాపింగ్ అసలు సూత్రధారులు హరీశ్ రావు, సంతోష్ రావు, శ్రవణ్లే కవిత అంటున్నారు.
Also Read: New GST Slabs: మారిన జీఎస్టీ శ్లాబ్ రేట్స్.. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట!
ప్రస్తుతానికి ఎలాంటి భవిష్యత్ ప్లాన్లు లేవన్న కవిత.. రానున్న రోజుల్లో మరిన్ని లీక్స్ ఉంటాయంటూ హింట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవితో సహా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇకపైనా కేసీఆర్ ఫొటోతోనే కార్యక్రమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. కవితకు పొలిటికల్ యాంబిషన్స్ విపరీతంగా ఉంటాయని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. తనంతట తాను పార్టీని వీడితే.. కష్టకాలంలో కేసీఆర్ని వదిపెట్టారని ఆమెపై ముద్ర వేస్తారు. అందుకే పార్టీయే తనపై వేటు వేసేలా.. కాళేశ్వరం-సీబీఐ అంశాన్ని తెలివిగా ఉపయోగించుకున్నారని మరికొందరంటున్నారు. ప్రస్తుతానికి తన వెంట వచ్చేవారు ఎవరూ లేరని తెలిసినా… ఒంటరిగానే రాజకీయం చేయగల సత్తా తనకు ఉందని కవిత నమ్ముతున్నట్లున్నారు. బహుషా జయలలిత ‘అన్నా డీఎంకే’ స్థాపించినట్లు… కవిత ‘బాపు బీఆర్ఎస్’ స్థాపిస్తారేమో మరి. పేరు ఏదైనా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమనే అంటున్నారు జాగృతి నేతలు. ఇప్పుడున్న కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ.. ఇక ఏమాత్రం కేసీఆర్ పార్టీగా నడవదని, హరీశ్రావే అంతా నడిపిస్తాడని కవిత చెప్పదలుచుకున్నారని, అందువల్లే హరీష్ రావును మెయిన్ విలన్గా పేర్కొంటూ టార్గెట్ చేశారని అనలిస్టులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా… బీఆర్ఎస్లో నడుస్తోన్న ప్రజెంట్ రాజకీయం ఆ పార్టీని కాపాడుతుందా? మరింత పతనావస్థకి చేర్చుతుందా? ఎక్కడిదాకా తీసుకెళ్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ ఇదంతా మొదలైంది మాత్రం కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించాలన్న ఒకే ఒక్క నిర్ణయం వల్లే. రేవంత్ నిర్ణయం బీఆర్ఎస్లో ‘కారు బాంబు’లా పేలిందా? రేవంత్ రెడ్డి వ్యూహాస్త్రం పని చేయడం మొదలు పెట్టిందా? కేసీఆర్ కోట నిలువునా చీలుతుందా? లేక కలుపు మొక్కలను తొలగించుకుని, కొత్తదనం సంతరించుకుని… గులాబీ మళ్లీ విరబూస్తుందా? వేచి చూడాలి.