Chevireddy Notice: జగన్ కోటరీలో కీలక వ్యక్తిగా చెలామణి అవుతున్న చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు నోటీసులు జారీ అయ్యాయి. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ తుడా చైర్మన్ కూడా అయిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని, ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అవినీతి నీలి నీడలు వెంటాడుతున్నాయి. 2019 నుండి 24 వరకు.. ఐదేళ్ల పాటు తుడాని ఏలిన తండ్రీ కొడుకులు.. ఈ ఐదేళ్ల కాలంలో తుడా నిధులను దాదాపు 90 శాతం మేర పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తుడా నిధులను చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 15 మంది ఎంపీడీవోలకు మళ్లించి, వాటి ద్వారా తన కుటుంబసభ్యుల పేరున ఉన్న కేవీఆర్ నిర్మాణ సంస్థకు తరలించి, తుడా పరిధిలో నిర్మాణాలన్నీ వారే చేపట్టినట్లు వచ్చిన ఆరోపణలపై, ఆధారాలు సైతం లభ్యం అవుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీరియస్గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, తుడా ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా పనిచేసిన వారికీ, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పనిచేసిన 15 మంది ఎంపీడీవోలకు కూడా సోమవారం తాఖీదులు అందాయి. మొత్తం 37 ప్రశ్నలకు సమాధానాలు కోరిన విజిలెన్స్ అధికారులు..
చంద్రగిరి ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని.. గత రెండేళ్లుగా చెవిరెడ్డి అక్రమాలపై పోరాటం చేస్తున్నారు. ఎన్నోసార్లు ఆధారాలతో సహా ఆరోపణలు చేసినా ఫలితం దక్కలేదు. చెవిరెడ్డి అవినీతి ఫైళ్లు పట్టుకుని పులివర్తి నాని తిరగని ఆఫీసు లేదు, ఫిర్యాదు చేయని అధికారి లేడు. ఎట్టకేలకు పులివర్తి నాని ప్రయత్నం ఫలించింది. చెవిరెడ్డి పాపం పండింది. చివరికి చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో చెవిరెడ్డి అక్రమాలు, అవినీతిపై పులివర్తి నాని సాక్ష్యాధారాలతో సహా ఆరోపణలు చేస్తూ వచ్చినా.. అప్పట్లో ఈ అంశాన్ని బుట్ట దాఖలు చేసింది వైసీపీ ప్రభుత్వం. తన సొంత గ్రామమైన తుమ్మలగుంటలో స్టేడియం నిర్మాణం, పార్క్ డెవలప్మెంట్ అంటూ అభివృద్ధి కహానీలు నడిపించిన చెవిరెడ్డి.. తాను కాజేసిన హథీరాంజీ మఠం భూముల విలువను పెంచుకునేందుకు తుడా నిధులను ఎలా వాడారన్నది పులివర్తి నాని గతంలోనే బట్టబయలు చేశారు. సాక్షాత్తూ తుమ్మలగుంట ప్రజలే… చెవిరెడ్డి ఆక్రణలో ఉన్న మఠం భూములను వెలుగులోకి తీసుకొచ్చి.. నిరసన చేపట్టిన పరిస్థితి. ఇది కాకుండా.. వైసీపీ దొంగ ఓటర్లను సృష్టించడంలో చెవిరెడ్డి పాత్ర కీలకమని నాని చేసిన ఆరోపణలను సైతం పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. వాటిపైన కూడా విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే దొంగ ఓటర్ల ఎపిక్ కార్డుల తయారీలో కీలకంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
Also Read: Telangana Congress: మల్లు రవిపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ విమర్శల బాణం
Chevireddy Notice: చెవిరెడ్డి హయాంలో తుడాలో దాదాపు 150 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. తన సొంత ప్రయాణాల కోసం విమాన టిక్టెట్లు, తన సొంత వాహనాలకు డీజిల్ ఖర్చులు, తుడాలో ఎలాంటి విధులు నిర్వహించని తన 19 మంది తన సొంత సిబ్బందికి జీతాలు… ఇలా స్వకార్యం ఏదైనా సరే.. ఏటీఎం నుండి మనీ డ్రా చేసినంత ఈజీగా, తుడా నిధులను వాడేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై నిత్యం గళమెత్తుతున్న పులివర్తి నాని చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిస్తే.. తమ తప్పులన్నీ బయటకొస్తాయన్న కంగారులో.. ఫలితాలు వెలువడక ముందే.. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి యూనివర్సిటీ ప్రాంగణంలోనే నానిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు చెవిరెడ్డి వర్గీయులు. ఈ హత్యాయత్నంలో స్వయంగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి సోదరుడు రఘు హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. అయినప్పటికీ కనీసం మోహిత్ రెడ్డి, రఘులను అరెస్ట్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. తన కుమారుడు, సోదరుడు దొరికిపోయారనగానే.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద స్థాయిలోనే చక్రం తిప్పి.. కూటమి ప్రభుత్వంలోనే లాబీయింగ్ చేశారని రాజకీయవర్గాల్లో టాక్ ఉంది. అయితే.. వీటన్నింటిపైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణలో.. అనేక నిజాలు వెలుగులోకి రానున్నాయి.
ఇప్పటికే గత వైసీపీ హయాంలో అవినీతి చేసిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కటకటాల పాలు అవుతున్న నేపథ్యంలో… లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలతో టాప్లో నిలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం శిక్ష అనుభవించక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే లాబీయింగ్లు, బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయడంలో చేయి తిరిగి చెవిరెడ్డిని తక్కువ అంచనా వేయలేం అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. ఇప్పటికైనా చెవిరెడ్డిని కట్టడి చేయకపోతే, అతని లాబీయింగ్లకు తలొగ్గితే, సమయం చూసుకుని మళ్లీ విష నాగులా విజృంభించి.. చంద్రగిరిలో టీడీపీ భవిష్యత్తును కాలరాసినా ఆశ్చర్యం లేదని తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. మరి అధిష్టానం, ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటుంటో వేచి చూడాలి.
